అక్కే ఆశాదీపం..
ఆర్మూర్ వేదికగా సమరశంఖం…
ఇక యాక్టివ్ పాలిటిక్స్… పూర్వవైభవం కోసం రంగంలోకి ఎమ్మెల్సీ కవిత…
పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుల గురించి ప్రత్యేక ప్రసంగం…
అందరికీ మంచి అవకాశాలు.. పదవులు.. అభయమిచ్చిన అక్క.
జిల్లా రాజీకీయాల్లో వేడి.. ఇక ఎన్నికల వాతావరణం తలపించేలా మీటింగులు…
బీఆరెస్లో పెరిగిన జోష్… అసంతృప్త నేతలకు కవిత రాకతో బూస్టింగ్…
నిజామాబాద్ పార్లమెంటు నుంచే బరిలోకి దిగేందుకు రెడీ… పరోక్షంగా మీటింగులు డిక్లేర్..
ఎమ్మెల్సీ కవిత జిల్లా రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. మొన్నటి వరక ఆమె అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండల బీఆఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె రాకను ఘనంగా స్వాగతించారు బీఆరెస్ శ్రేణులు. కవిత ప్రసంగం రెట్టించిన ఉత్సాహంతో సాగింది. కార్యకర్తల్లో, అభిమానుల్లో,సీనియర్ నాయకులు, ఉద్యమకారుల్లో కొత్త ఊపిరిలూదింది. అప్పటి తరం నేతలందరి పేర్లను ఆమె జ్ఞప్తికి తెచ్చుకున్నారు. వారు పడ్డ కష్టాలు, పార్టీ పటిష్టత కోసం చేసిన త్యాగాలను నెమరు వేసుకున్నారు.
ఉద్యమకారులను పార్టీ ఏనాడూ మరిచిపోదని, వారికి సరైన అవకాశాలు, మంచి పదవులు ఇస్తుందని ఆమె ఈ వేదికగా హామీ ఇచ్చారు. అప్పటి తరం నాయకుల వల్లే, వారు చేసిన త్యాగాల పునాదుల మీదే పార్టీ ఇంత బలీయంగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని, ఉద్యమకారుల త్యాగాల నుంచి ప్రభుత్వ పథకాలు పుట్టుకొచ్చాయని ఆమె చెప్పారు. తాను మళ్లీ నిజామాబాద్ పార్లమెంటు నుంచే పోటీ చేయనున్నట్టు పరోక్షంగా ఈ వేదికగా నాయకులు ప్రకటించారు. దీంతో ఆమె పోటీ విషయంలో సందిగ్ధత తొలిగిపోయింది. ఇక ఆమె ముందున్న కర్తవ్యం.. మళ్లీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో క్లీన్స్వీప్ చేయడమే.
అదే పంథాలో ఆమె ప్రసంగం సాగింది. రెట్టించిన ఉత్సాహంతో కొనసాగింది. అందరినీ కలుపుకుపోయే విధంగా పరిపక్వతతో కూడాన ఆమె ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. జీవన్ రెడ్డి గెలుపు గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో ఉంటుందని, పరోక్షంగా, నర్మగర్బంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో, కామారెడ్డి జిల్లాలో బీఆరెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తిరుగులేదని, క్లీన్ స్వీప్ చేయడం ఖామయని ఆమె ధీమాతో ఈ వేదికగా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తమను పట్టించుకోకుండా వదిలేశారనే అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు ఆమె మాటలు స్వాంతన చేకూర్చాయి. బూస్టింగ్ ఇచ్చాయి. భవిష్యత్పై ఆశలు కల్పించాయి. మళ్లీ ఉద్యమ స్పూర్తిని రగిలించడంలో కవిత సక్సెస్ అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె చాలా కాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు.
తనదైన విశ్వరూపం చూపేందుకు రెడీ అయ్యారు. ఆర్మూర్ వేదికగా ఇది నిరూపితమైంది. ఇక జిల్లాలో విరివిరిగా పర్యటించడం, మీటింగులు పెట్టుకోవడం, ఆత్మీయ సమ్మేళనాలతో తను కూడా అందరితో మమేకం కావడం.. ఇక నిత్యకృత్యం కానుంది. దీనికి తోడు తెలంగాణ ఆవిర్బావ వేడుకల కోసం ఇరవై రోజుల పాటు ఆమె ఇక్కడే మకాం వేసేలా ఉంది. ఇకపై జిల్లాలో ఫోకస్ పెరగనుంది. ఆమె మళ్లీ జిల్లాలో యాక్టివ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో చలనం ప్రారంభమైంది. ప్రతిపక్షాల్లో చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఆమె లేని లోటు పార్టీ శ్రేణులకు చాలా ఇబ్బందికరంగా మారింది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండటం, పార్టీ,ప్రభుత్వ పదవులు లేకపోవడంతో చాలా నైరాశ్యంతో ఉన్నారు. కవిత ఈ రోజు ఆర్మూర్ నియోజకవర్గ వేదికగా చేసిన ప్రసంగం చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. భవిష్యత్తుకు ఓ కొత్త రూపం దర్శనమిచ్చింది.ఆమే ఇప్పుడు జిల్లా కార్యకర్తలకు, నాయకులకు ఆశాదీపంలా కనిపిస్తోంది.