ప్రభుత్వం ఏర్పడీ ఏర్పడగానే కేసీఆర్ ఇక ఉద్యమ పార్టీ కాదన్నాడు. ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించేశాడు. ఇదేందీ..? అని అంతా ఆశ్చర్యపడ్డారు. కేసీఆర్ మారిపోయాడా..? అని కూడా అనుకున్నారు. అనుకున్నదే జరిగింది. సీఎంగా మారిన తర్వాత కేసీఆర్ చాలానే మారాడు. ఎంతలా అంటే ప్రజలకు కాదు కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఆయనను కలిసేందుకు ఛాన్స్ దొరకనంత. ఎప్పుడన్నా జిల్లా పర్యటనలు.. అక్కడే బహిరంగ సభలు. అంతే. అంతకు మించి జనంతో మిలాఖత్ లేదు.. ములాఖతూ లేదు. అసలు ఎమ్మల్యేలే అందుబాటులో లేనప్పుడు.. ఇక సీఎం మాత్రం జనానికి అందుబాటులో ఉంటారా..? అదే వ్యతిరేకత మూటగట్టుకుంది ప్రభుత్వం. ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నదనే సంకేతం కేసీఆర్కూ అందింది. సర్వేలు చేపించుకుని పెట్టుకున్నాడు. సిట్టింగులకే టికెట్లని ప్రకటించాడు కానీ.. మదిలో మాత్రం వేరే ఉంది.
చాలా చోట్ల సిట్టింగులకు ఈసారి మొండిచేయి తప్పదు. ఇది తథ్యం. సరే.. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకొస్తున్నట్టు…. కేసీఆర్ రైతుల పరామర్శకు వెళ్లడం ఇప్పుడో చర్చ. కేసీఆర్ ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో.. ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. తప్పులు తెలుసుకున్నాడు. దిద్దుబాటు చర్యలకు దిగాడు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయిన పంట పరిశీలన.. వారికి భరోసా నింపే కేసీఆర్ పర్యటన మాత్రం ఇప్పుడు రాజకీయంగా ఓ చర్చ. కేసీఆర్లో మార్పుకు ఇది సంకేతం. తప్పులు , లోపాలు తెలుసుకుని మసలుకొని వాటిని చక్కదిద్దే పనిని సీఎంగా తన నుంచే శ్రీకారం చుట్టాడు కేసీఆర్. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది కూడా కేసీఆర్ చరిష్మానే. అప్పుడు మద్యంతరం పాట పాడి.. కేవలం తన భుజస్కంధాలపైనే గెలుపు తీరాలకు తీసుకెళ్తా అనే ధీమాతో సిట్టింగులకే టికెట్లిచ్చి .. అనుకున్నది సాధించగలిగాడు.
ఇక మూడోసారి అలాంటి సీన్ కనిపించడం లేదు. అంతలా వచ్చింది ఏవగింపు ప్రజలకు. అంతగా వ్యతిరేకిస్తున్నారు ప్రజాప్రతినిధులను ప్రజలు చాలా చోట్ల. అందుకే ఇక కార్యక్షేత్రం ఏమిటో కేసీఆర్కు అవగతమైంది. రంగంలోకి దిగాడు. ప్రజల వద్దకు వెళ్లాడు. పరిస్థితులన్నీ ఇప్పుడు ఒక్కసారిగా కేసీఆర్ వైపు తిరిగాయి. కేసీఆర్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. కానీ ఈసారి కొత్తగా. మార్పు వచ్చినంతగా… మార్పు వచ్చేంతంగా….