కేటీఆర్లో పరిపక్వత కనిపిస్తున్నది. అదే ఆవేశం.. కానీ సబ్జెక్టుంటుంంది. చెప్పే విధానంలో తనదైన శైలి ఉంటుంది. వేసే సెటైర్లలో తిరుగులేని పంచులుంటాయి. అందుకే ఆయనలో అప్పుడే క్లాస్ లీడర్ కనిపిస్తాడు. అప్పుడే మాస్గా కూడా వీర విహారం చేస్తాడు. నిజామాబాద్ నగర పర్యటనకు వచ్చిన ఆయన ఇక్కడ ప్రెస్మీట్లో మాట్లాడిన తీరు ఆద్యాంతం ఆకట్టకున్నది. మోడీ చేసింది.. చేస్తున్నది… పేదోడు దోపిడికి గురవుతున్నది… బీఆరెస్ చేయాలనుకుంటున్నది… కేంద్రం చేయాల్సిన డిమాండ్లను అన్నింటినీ ఏకరువు పెట్టిన ఆయన మధ్యలో అర్వింద్ టాపిక్ తీసుకొచ్చాడు. ఎక్కడా అతని పేరును కూడా తీసుకోలేదాయన. డీఎస్ ను పెద్దమనిషని సంబోధిస్తూ ఆయనంటే గౌరవముందన్నాడు కేటీఆర్. అలా అంటూనే కొడుకు అర్వింద్ను టార్గెట్ చేశాడు. ఎంత సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడో అంటూ చురకలంటించాడు.
తాము మాట్లాడగలుగుతామంటూనే తమకు సంస్కారం అడ్డొస్తుందని, అందుకే నీలా సంస్కార హీనంగా మాట్లాడబోమని కూడా ఆయన స్పష్టతనిచ్చి మాటలతో వాతల మీద వాతలు పెట్టాడు. ఒక్క పైసా కేంద్రం నుంచి తెచ్చింది చెప్పాలని, నోటికేదొస్తే అది మాట్లాడటం.. తిట్టడం సభ్యత కాదంటూ సుతిమెత్తగా చురకలంటిస్తూనే ఘసంస్కార హీనుడిగా అర్వింద్కు పరోక్షంగా దుయ్యబట్టడం కొంత పొలిటికల్ వేడిని రాజేసింది. స్వయంగా కేటీఆరే.. ఇందూరు వేదికగా అర్వింద్ను సంస్కారం లేదని తిట్టి మరీ వెళ్లినట్టయ్యింది. ఇదిప్పుడు జిల్లా రాజకీయాల్లోనే కాదు… రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ టాపిక్గా మారింది. వాస్తవంగా ఎంపీగా కవిత ఓటమిలో డీఎస్ కీలకంగా వ్యవహరించారు. ఇది అందరికీ తెలుసు.
కానీ ఇక్కడ కేటీఆర్ లౌక్యం ప్రదర్శించాడు. వయసుకు గౌరవ మిచ్చాడు. ఆయన రాజకీయ అనుభవానికి మర్యాద ఇస్తున్నట్టుగానే మాట్లాడి.. అతని కొడుకు రాజకీయంగా ఎంతలా దిగజారాడో చెప్పాలనుకున్నాడు. అదే చేశాడు. ఇక్కడ కేటీఆర్ డీఎస్ను మెచ్చుకున్నా…. అది పెద్దగా లెక్కలోకి రాదు. ఎందుకంటే.. ఆ వెంటనే చిన్న కొడుకును తిట్టడానికే పెద్ద మనిషి పేరును తీసుకున్నాడనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కేటీఆర్ చేసిన కామెంట్లో … ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తండ్రిని పొడిగినా.. కొడుకును తెగిడినా…. తను గురి పెట్టిన బాణం తాకాల్సిన చోట తాకిందా లేదా అనేదే లక్ష్యం… అది నెరవేరింది. అందుకే ఈ ప్రెస్మీట్ అంతటిలో.. కేటీఆర్ సెటైర్లలో ఇది బీజేపీ శ్రేణులకు ఘాట్టిగానే తాకింది.